నవపక్షం, దమ్మపేట, ఆగస్టు 09: దమ్మపేట మండలంలో పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దమ్మపేట మండల పరిధిలోని మారప్పగూడెం, నాచారం, నాగుపల్లి గ్రామాల్లో పలు నూతన భవనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంత్రి సీతక్కను ఆహ్వానించగానే స్పందించి పర్యటనకు వచ్చినందుకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నాగుపల్లిలో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం
నాగుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీల కోసం నిర్వహించిన శ్రీమంత కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన ‘తొలి ముద్ద’ కార్యక్రమాన్ని నాగుపల్లి గ్రామంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, తల్లులు మరియు పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
మంత్రి సీతక్క నాగుపల్లి గ్రామానికి విచ్చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల గ్రామ పాలకవర్గం, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






