నవపక్షం, నల్లబెల్లి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు నల్లబెల్లికి రానున్నారు. ఉద్యమ నాయకుడు, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేయడంతో పాటు, ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు.
అనంతరం నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు. పార్టీ శ్రేణులతో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ నల్లబెల్లి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.






