నవపక్షం, తెలంగాణ బ్యూరో: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఉచిత చీరల ఉత్పత్తి ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈసారి కొత్త డిజైన్లతో పాటు నీలం రంగుకు బదులుగా చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మే నెలలో మొత్తం 4.62 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా, ఇప్పటివరకు 1.74 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి పూర్తయింది. మిగిలిన ఉత్పత్తిని కూడా నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
చీరల ఉత్పత్తి కోసం ప్రభుత్వం మొత్తం రూ.450 కోట్లను కేటాయించింది. ఇందులో ఇప్పటికే రూ.142 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం. సెప్టెంబరు 20లోగా చీరల ఉత్పత్తిని పూర్తిచేసి, అక్టోబర్లో మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్లూమ్లు, మ్యాక్స్ సంఘాలకు పెద్దఎత్తున పని లభిస్తోంది. దీంతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతన్నల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో పవర్లూమ్ పరిశ్రమకు ఊతం లభించడంతో పాటు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.
కొత్త రంగులు, డిజైన్లతో రూపొందుతున్న ఈ చీరలను అక్టోబర్లో మహిళలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.






