నవపక్షం, ఆగస్టు 9, శాలిగౌరారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ శాలిగౌరారం ఆధ్వర్యంలో, సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి సహకారంతో గురజాల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, మొత్తం 120 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.
గురజాల గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ ఆధ్వర్యంలో ఆయన తల్లిదండ్రులు క్రీస్తుశేషులు ఎర్ర యాదయ్య, వెంకటమ్మ జ్ఞాపకార్థం శిబిరానికి హాజరైన వారికి చుక్కల మందులు, కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు.
కంటి పరీక్షల్లో ఆపరేషన్ అవసరమని గుర్తించిన 15 మందిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రికి ఉచిత కంటి ఆపరేషన్ల కోసం తరలించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిమ్మల ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు అందించడం లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేద ప్రజల కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఉచిత కంటి వైద్య శిబిరానికి సహకరించిన సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గురజాల గ్రామ ప్రజలకు లయన్స్ క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ డెంకల సత్యనారాయణ, చార్టర్డ్ ప్రెసిడెంట్ బుడగ శ్రీనివాసులు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎర్ర శంభులింగారెడ్డి, కోశాధికారి మురారి శెట్టి కర్ణాకర్, రెండో ఉపాధ్యక్షులు వడ్లకొండ బిక్షం, మారోజు వెంకటాచారి, కందుకూరు భీష్మాచారి, మాజీ సర్పంచ్ అంజయ్య, గ్రామ పెద్దలు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






